టీడీపీకి ఝలక్... రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిర్ణయం!
- నరసాపురం సీటును ఆశించిన కొత్తపల్లి
- సీటు ఇవ్వకపోవడంతో మనస్తాపం
- ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే ఆలోచన
నరసాపురం అసెంబ్లీ టికెట్ ను తనకు కేటాయించలేదన్న మనస్తాపంతో ఉన్న మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ, తాను రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీ అధిష్ఠానం తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని వాపోయారు. అనుచరులకు, నమ్ముకుని ఉన్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. దీంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి సత్తా చాటుదామని పలువురు సూచించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోని కొత్తపల్లి సుబ్బారాయుడు, నేటి సాయంత్రంలోగా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని టీడీపీ మాధవనాయుడుకు ఇచ్చిన సంగతి తెలిసిందే.